సనత్నగర్లో దారుణం: అనుమానంతో భార్య హత్య
సనత్నగర్,(విజయక్రాంతి): సనత్నగర్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త కత్తితో గొంతు కోసి హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఫతేనగర్ ప్రాంతానికి చెందిన వాసు (40), తన భార్య రేణుక (38)తో కలిసి నివసిస్తున్నాడు. కొంతకాలంగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న వాసు తరచూ గొడవలకు దిగేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మరోసారి భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది.
ఆ వాగ్వాదం కాస్తా తీవ్రరూపం దాల్చడంతో కోపోద్రిక్తుడైన వాసు కత్తితో రేణుక గొంతు కోసి హత్య చేశాడు.హత్య అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే సనత్నగర్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలు, అనుమానాలే ఈ దారుణానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.




