బీఆర్ఎస్ సారథి ఎవరు?
- పార్టీకి దూరంగా ఉంటున్న మల్లారెడ్డి
- కొత్త నాయకుడి కోసం కసరత్తు
- నియోజకవర్గంలో బలంగా ఉన్న బీఆర్ఎస్
మేడ్చల్ బీఆర్ఎస్లో నాయకత్వ సంక్షోభం! మల్లారెడ్డి పార్టీకి దూరమవుతుండటంతో కొత్త సారథి ఎవరు? కార్పొరేషన్ ఎన్నికల ముందు తెరపైకి వచ్చిన పేర్లు ఇవే...
మల్లారెడ్డి దూరం.. బీఆర్ఎస్లో నాయకత్వ చర్చ
మేడ్చల్, జూలై 19(విజయ క్రాంతి): మేడ్చల్ బీఆర్ఎస్ సారథి ఎవరు అనే చర్చ రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పార్టీకి దూరం కావడంతో కొత్త నాయకుడిని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు చామకూర మల్లారెడ్డి నియోజకవర్గంలో పెద్ద దిక్కుగా ఉన్నారు. అన్నీ తానే వ్యవహరించారు. ఆర్థికంగా బలంగా ఉండడంతో ఖర్చుకు కూడా వెనుకాడ లేదు.
కొంతకాలంగా అంటి ముట్టనట్లు వ్యవహరించిన మల్లారెడ్డి సరూర్ నగర్ లో బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సంగ్రామం కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో పార్టీకి దూరమైనట్లు స్పష్టమవుతోంది. సరూర్ నగర్ లో శనివారం ఉదయం జరిగిన యువ సంగ్రామం కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మల్లారెడ్డి డుమ్మా కొట్టారు. నగరంలోనే ఉన్నప్పటికీ హాజరు కాలేదు. సాయంత్రం ఘట్కేసర్ లో జరిగిన ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమానికి హాజరయ్యారు. మల్లారెడ్డి బి.ఆర్.ఎస్ కార్యక్రమానికి హాజరుకాకున్నప్పటికీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు.
కార్పొరేషన్ ఎన్నికల ముంగిట..
మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ముంగిట మల్లారెడ్డి దూరం కావడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. 2023 ఎన్నికలు జరిగినప్పటి నుంచి మల్లారెడ్డి వ్యవహార శైలిపై అధిష్టానం కన్నేసి ఉంచింది. పార్టీ మారుతారని అనుమానించింది. కానీ వేచి చూసే ధోరణి అవలంబించింది. మల్లారెడ్డి ఇతర పార్టీలతో స్నేహం చేయడంపై కేసీఆర్ సైతం అసహనం వ్యక్తం చేశారు. ఏదో ఒక పార్టీలో ఉండాలని పార్టీ సమావేశంలో మల్లారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
త్వరలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మేడ్చల్ నియోజకవర్గం సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఉంది. కార్పొరేషన్ల ఎన్నికల నేపథ్యంలో పార్టీని ముందుండి నడిపించే నాయకుడు కావాలి. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకుల పేర్లు పరిశీలించే అవకాశం ఉంది. డీలిమిటేషన్ జరిగితే నియోజకవర్గం రెండు మూడు నియోజకవర్గాలుగా విడిపోయే అవకాశం ఉంది.
నియోజకవర్గానికి ఒకరిని నియమించే బదులు డిలిమిటేషన్ దృష్టిలో పెట్టుకొని రెండుగా విభజించి ఇన్చార్జిలను నియమిస్తే బాగుంటుందని పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఘట్కేసర్, బోడుప్పల్ ప్రాంతాలకు ఒకరిని, మేడ్చల్ ప్రాంతానికి ఒకరిని నియమిస్తే బాగుంటుందంటున్నారు. ఇన్చార్జీలుగా పలువురు పేర్లు తెరమీదకు వస్తున్నాయి. జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, గుండ్ల పోచంపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి, పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి పేర్లు పరిశీలించే అవకాశం ఉంది.
వీరు మొదటి నుంచి పార్టీలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ పాల్గొన్నారు. వీరికి కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు వద్ద గుర్తింపు ఉంది. ఆర్థిక బలం అంగ బలం ఉన్నందున భవిష్యత్తు అవసరాలకు కూడా వీరు ఉపయోగపడతారని కార్యకర్తలు అంటున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, సర్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న రాగిడి లక్ష్మారెడ్డి పేరు కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఈయన ఉప్పల్ నియోజకవర్గానికి చెందినవారు.
పార్టీ సభ్యత్వ నమోదు సర్ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల నియోజకవర్గంలో పట్టు సాధించారు. నియోజకవర్గానికి చెందిన నాయకులను ఇన్చార్జిగా నియమించడం వల్ల మిగతా వారిలో అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉన్నందున తాత్కాలికంగా రాగిడి లక్ష్మారెడ్డికి బాధ్యతలు అప్పగించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.
నియోజకవర్గంలో బలంగా బి.ఆర్.ఎస్
మేడ్చల్ నియోజకవర్గం లో బి ఆర్ ఎస్ పార్టీ బలంగా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కొంతమంది నాయకులు వలస వెళ్లినప్పటికీ మెజారిటీ నాయకులు పార్టీలోనే క్రియాశీలంగా ఉన్నారు. ఇటీవల జరిగిన మూడు మునిసిపాలిటీలలో రెండింటిని కైవసం చేసుకుంది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే మూడో మునిసిపాలిటీ కూడా బీఆర్ఎస్ ఖాతాలో చేరేది. కానీ లోపాయికారి ఒప్పందం వల్ల అలియాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్కు జార విడిచారు.
మేడ్చల్ బీఆర్ఎస్ సారథి ఎవరు?
మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో కొత్త నాయకుడి కోసం బీఆర్ఎస్ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా పలువురు సీనియర్ నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రశ్న: మేడ్చల్ బీఆర్ఎస్ సారథిగా ఎవరు వచ్చే అవకాశం ఉంది?
సమాధానం: మల్లారెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో బీఆర్ఎస్ అధిష్టానం కొత్త ఇన్చార్జ్ను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భాస్కర్ యాదవ్, మధుకర్ రెడ్డి, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, జక్కా వెంకట్ రెడ్డి తదితరుల పేర్లు చర్చలో ఉన్నాయి.
FAQ's
మేడ్చల్ బీఆర్ఎస్ సారథి ఎవరు?
ప్రస్తుతం అధికారికంగా ఎవరినీ ప్రకటించలేదు. పలువురు సీనియర్ నాయకుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
మల్లారెడ్డి బీఆర్ఎస్ను వీడుతున్నారా?
దీనిపై అధికారిక ప్రకటన లేదు. అయితే పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకపోవడం రాజకీయ చర్చకు దారితీసింది.
కొత్త ఇన్చార్జ్ను ఎందుకు నియమించే అవకాశం ఉంది?
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పార్టీని సమర్థంగా నడిపించేందుకు నాయకత్వం అవసరమని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.
RELATED ARTICLES...
మల్లారెడ్డి యూనివర్సిటీలో తనిఖీలు
బీఆర్ఎస్ కార్యక్రమానికి మల్లారెడ్డి డుమ్మా- సీఎం కార్యక్రమానికి హాజరు
పెద్దమల్లారెడ్డి శివారులో స్టార్టర్ చోరీ
బీఆర్ఎస్కు మల్లారెడ్డి దూరమైనట్లేనా?
పెద్దమల్లారెడ్డిలో డొడ్డి కొమురయ్య 80వ వర్ధంతి నిర్వహణ
పెద్దమల్లారెడ్డిలో గ్రామపంచాయతీ ట్రాక్టర్ దొంగతనం






