ప్రజా సమస్యల పరిష్కారం కోసమే నిరంతరం కృషి చేస్తాం
మున్సిపల్ చైర్ పర్సన్ ఆకాష్, వైస్ చైర్ పర్సన్ ఎండి అహ్మద్
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): పట్టణంలోని ప్రతి వార్డులో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసమే నిరంతరం కృషి చేస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ ఆకాష్, వైస్ చైర్ పర్సన్ ఎండి అహ్మద్ స్పష్టం చేశారు. పట్టణంలోని 12వ వార్డులో గత వారం రోజులుగా వాటర్ మోటార్ చెడిపోవడంతో కాలనీవాసులు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను మున్సిపల్ చైర్ పర్సన్ ఆకాష్, వైస్ చైర్ పర్సన్ ఎండి అహ్మద్, కౌన్సిలర్ ఆత్రం కృష్ణమ్మల దృష్టికి కాలనీవాసులు తీసుకురావడంతో శుక్రవారం నూతన వాటర్ మోటార్ను ఏర్పాటు చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... 12వ వార్డు ప్రజల విన్నపం మేరకు యుద్ధ ప్రాతిపదికన కొత్త మోటార్ను మంజూరు చేయించి, నీటి సరఫరాను పునరుద్ధరించామని వారు తెలిపారు. ప్రజా సేవలో భాగంగా వార్డుల అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తమ సమస్యను చెప్పిన వెంటనే స్పందించి పరిష్కరించినందుకు కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ చైర్పర్సన్ ఆకాష్, వైస్ చైర్పర్సన్ అహ్మద్, శాలువాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సల్మాన్ ఖాన్, ఆత్రం భీం భాయ్, నూరి, సుప్రజ, జమీల్ హుస్సేన్, ఆఫ్తాబ్ , కాలనీ ప్రజలు పాల్గొన్నారు.




