24 March, 2026 | 4:25 PM

అణచివేత ధోరణి వీడి ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలి

24-03-2026 12:00 AM

బీజేపీ మండల అధ్యక్షులు బాలాజీ

కోనరావుపేట,మార్చి 23 (విజయక్రాంతి):రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా, ప్రజా సమస్యలపై గళమెత్తే నాయకులను అణచివేసే ధోరణి మారలేదని భారతీయ జనతా పార్టీ కోనరావుపేట మండల శాఖ అధ్యక్షులు మిర్యాల్ కార్ బాలాజీ విమర్శించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరించిన ప్రజావ్యతిరేక విధానాలనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగించడం సిగ్గుచేటని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ నాయకులు,డిమాండ్ చేశారు.

బీజేపీ నాయకులను, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాల్సింది పోయి, ప్రశ్నించే నాయకుల గొంతులను నొక్కేయడానికే ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని, ప్రజా పక్షాన పోరాడే వారిని వేధించడం సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు.

ప్రజల సమస్యలను ఎత్తిచూపడం ప్రతిపక్షంగా మా బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తిస్తుంటే అరెస్టులకు పాల్పడటం ప్రభుత్వాల అసమర్థతకు నిదర్శనం. ఇప్పటికైనా అణచివేత ధోరణి వీడి, ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలి అని బాలాజీ అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా డిస్ట్రిక్ కౌన్సిల్ సభ్యుడు గొట్టే రామచంద్రం, కోనరావుపేట మండల ప్రధాన కార్యదర్శి బైరగోని సురేష్ గౌడ్, సీనియర్ నాయకులు జవాజి తిరుపతి గౌడ్, వెలిశాల రవీందర్, చల్ల జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.