ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి
- సరూర్ నగర్ తహసీల్దార్ వేణు గోపాల్
ఎల్బీనగర్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) లో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సరూర్ నగర్ తహసీల్దార్ పి.వేణుగోపాల్ సూచించారు. సరూర్ నగర్ మండలానికి సంబంధించిన సహాయ ఎన్నికల నమోదు అధికారులు, సూపర్వైజర్లు, బీఎల్ఓలతో సమీక్ష నిర్వహించి, పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... 2025 ఓటరు జాబితాలోని అర్హులైన ఓటర్లందరిని 2002 ఓటరు జాబితాతో అనుసంధానం చేయాలన్నారు. మ్యాపింగ్ ప్రక్రియ 53 శాతమే అయిందని, మిగతా ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని పేర్కొంటూ బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించి వారంలోగా మ్యాపింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు.
అలాగే రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్ఎల సహకారం తీసుకోవాలని, రెసిడెన్షియల్ కాలనీల్లో సమావేశాలు నిర్వహించి ప్రతి ఓటరు మ్యాపింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటర్లు వివరాలు నమోదు చేయించుకోవాలని, కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు కూడా బిఎల్ఓలను కలిసి ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. తహసీల్దార్ వేణుగోపాల్, ఆర్ఐ జ్యోతితో కలిసి స్వయంగా సరూర్ నగర్ డివిజన్ వెంకటేశ్వర కాలనీలోని ఓటర్ ఇంటికి వెళ్లి బిఎల్ఓతో కలిసి మ్యాపింగ్ గురించి వివరించి, పలు సూచనలు చేశారు.






