విద్యార్థులకు విరోష్ స్కాలర్షిప్
- సొంతూల్లో దేవరకొండ విజయ్, రష్మిక సందడి
గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతంలో పాల్గొన్న కొత్త జంట
నాగర్కర్నూల్ జిల్లా తుమ్మన్పేటలో పండగ వాతావరణం
హాజరైన సినీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు
నాగర్కర్నూల్, మార్చి 2 (విజయక్రాంతి)/సినిమా ప్రతినిధి: ఇటీవలే వైవా హిక జీవితంలోకి అడుగుపెట్టిన హీరో విజయ్ దేవరకొండ తన సతీమణి రష్మిక మందన్న, కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఊరు తుమ్మన్పేటకు వెళ్లారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని బల్మూరు మండలంలో ఉన్న తుమ్మన్పేట విజయ్ సొంతూరు. విజయ్ స్వగ్రామం తుమ్మంపేట వద్ద ఉన్న తమ ఫామ్ హౌస్లో నిర్మించిన నూతన గృహప్రవేశం చేశారు.
ఈ సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బాదావత్ సం తోష్ దంపతులు, నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎంపీ పోతుగంటి రాములు, అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు, 400 మంది గ్రామస్తులు, అభిమానులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదికపై నుంచి నూతన దంపతులు విజయ్, రష్మిక సందడి చేశారు. అభిమాను లకు, గ్రామస్తులకు అభివాదం చేస్తూ వాళ్ల తో ఫొటోలు దిగారు. ప్రత్యేక వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
౯, ౧౦ తరగతి విద్యార్థులకు స్కాలర్షిప్
పెళ్లయిన తర్వాత తొలిసారి కుటుంబ సభ్యులతో కలిసి తుమ్మన్పేట్కు వెళ్లిన విజయ్ కుటుంబానికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “సొంత గ్రామం లో పెళ్లి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉంది. మా జంటకు ఆశీస్సులు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మన గ్రామానికి చాలా మంచి పనులు చేయాలని ఉంది.
ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ మాకు సొంత ఇల్లు, పొలము ఉన్నాయి. ఇక నుంచి తరుచూ మన గ్రామానికి వస్తా. అచ్చంపేట డివిజన్లో ఉన్న 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 9, 10వ తరగతి విద్యార్థులకు విజయ్ దేవరకొండ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్కాలర్ షిప్స్ అందిస్తాం” అని ప్రకటించారు.




