రోడ్డు కోసం రోడ్డెక్కిన గ్రామస్థులు
11-06-2026 03:25 PM
వాంకిడి, (విజయక్రాంతి): సోనాపూర్ బీటీ రోడ్డును వెంటనే మరమ్మతు చేయాలని డిమాండ్ చేస్తూ వాంకిడి మండలం గణేశాపూర్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై గురువారం సోనాపూర్ గ్రామస్థులు రాస్తారోకో నిర్వహించారు. సుమారు 300 మంది ఆందోళనలో పాల్గొనడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
2021లో డీబీఎల్ సంస్థ మట్టి తరలింపు కారణంగా సోనాపూర్ బీటీ రోడ్డు దెబ్బతిన్నప్పటికీ ఇప్పటి వరకు మరమ్మతులు చేపట్టలేదని గ్రామస్థులు ఆరోపించారు. గణేశాపూర్ వద్ద బస్టాండ్, సర్వీస్ రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీంతో కొంతసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.






