1 July, 2026 | 6:36 PM

Breaking News

రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •  

భద్రకాళి ఆలయంలో ఘనంగా వసంతోత్సవం

29-04-2026 02:25 AM

వరంగల్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో భద్రకాళీ భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు పదవ రోజుకు చేరుకున్నాయి. అమ్మవారికి ఉదయం 4 గంటలకు నిత్యాహ్నికం పూర్తిచేసి చతుస్థానార్చన జరిపిన తర్వాత అమ్మవారికి వసంతోత్సవం నిర్వహించారు.

ఉదయం విమానక సేవ (సర్వభూపాల వాహన సేవ), సాయంకాలం చతురన్తసేవపై అమ్మవారిని ఊరేగించారు. అమ్మవారికి బలి ఉత్సవం జరిపిన పిమ్మట విమానక సేవ వైభవంగా నిర్వహించారు. సాయంకాలం చతురంతసేవ కూడా అత్యంత వైభవంగా నిర్వహించారు.

బ్రహ్మోత్సవాలలో ఈ రోజు ఉభయదాతలుగా హైదరాబాదు వాస్తవ్యులు అమంచి నాగపరిమళ శ్రీనివాస రావు దంపతులు, రాష్ట్ర ఉపాధ్యక్షుల ఆవూనూరి రాంమూర్తి ఆధ్వర్యంలో అనేకమంది కుమ్మరి కుల పెద్దలు అమ్మవారికి పట్టువస్త్రాలు, పూలు, పండ్లు, పూజాద్రవ్యములు శిరస్సు మీద ధరించి మేళతాళాలతో వేదస్వస్తితో గుడిలోనికి ప్రవేశించి అమ్మవారికి సమర్పించారు.

అనంతరం అమ్మవారికి షోడశోపచారపూజ జరిపి అమ్మవారి అనుజ్ఞతో స్నపనమండపంలోకి ప్రవేశించి అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. తదుపరి నారీమణులచే అమ్మవారికి కుంకుమార్చన జరుపబడిన తర్వాత హోమం జరిపారు. ఆ తర్వాత అమ్మవారికి వాహన సేవ నిర్వహించారు. సాయంకాలం సర్వభూపాల వాహన సేవ కూడా వైభవంగా నిర్వహించారు.