వైభవ్ విధ్వంసం
రాజస్థాన్ చేతిలో ఆర్సీబీ చిత్తు
15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు
గువాహటి, ఏప్రిల్ 10: డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు షాక్ తగిలింది. వైభవ్ సూర్యవంశీ విధ్వంసం కొనసాగిన వేళ రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీని చిత్తు చేసింది. భారీ టార్గెట్ ను అలవోకగా ఛేదించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ కీలక ఆటగాళ్లందరూ ఫ్లాప్ అయ్యారు. ఫిల్ సాల్ట్ డకౌటవగా..పడిక్కల్ (14), కృనాల్ పాండ్యా(1), జితేశ్ శర్మ(5) పెవిలియన్కు క్యూ కట్టారు. కోహ్లీ క్రీజులో ఉన్నంత సేపు తనదైన క్లాసిక్ షాట్లతో అలరించాడు.
కోహ్లీ 16 బంతుల్లో 7 ఫోర్లతో 32 పరుగులకు ఔటవగా.. టిమ్ డేవిడ్ (13) కూడా నిరాశపరచడంతో బెంగళూరు 94 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెవ్ రజత్ పటిదార్, రొమారియో షెఫర్ట్ ఆర్సీబీని ఆదుకున్నారు. ఒకవైపు వికెట్లు పడుతన్నా పటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆకట్టుకుంది. ఆరంభంలో కాసేపు ఆచితూచి ఆడిన పటిదార్ క్రమంగా గేర్ మార్చాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు షెఫర్డ్ భారీ షాట్లతో స్కోర్ పెంచేందుకు ప్రయత్నించాడు. రొమారియో షెఫర్డ్ 11 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్ తో 22 పరుగులు చేయగా.. వెంకటేశ్ అయ్యర్ ను ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా దించింది. గత రెండు మ్యాచ్లలోనూ బెంచ్ కే పరిమితమైన వెంకటేశ్ అయ్యర్ చివర్లో ధాటిగా ఆడాడు. 15 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 29 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అటు పటిదార్ 40 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులకు ఔటయ్యాడు.
చివరికి ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్ 2 , బిష్ణోయ్ 2, బ్రిజేశ్ 2 వికెట్లు పడగొట్టారు. 202 పరుగుల లక్ష్యఛేదనలో యశస్వి జైస్వాల్(13) పరుగులకే ఔటైనప్పటకీ వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోయాడు. ఆర్సీబీ బౌలర్లను ఉతికారేశాడు. భువనేశ్వర్, హ్యాజిల్ వుడ్, కృనాల్ పాండ్యా ఇలా ఏ బౌలర్ బౌలింగ్కు వచ్చినా చుక్కలు చూపించాడు. బౌండరీలు, సిక్సర్లు బాదడం ఇంత ఈజీనా అనిపించేలా బుడ్డోడి బ్యాటింగ్ సాగింది. వైభవ్ సూర్యవంశీ కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వైభవ్ దెబ్బకు ఆర్సీబీ బౌలర్లు, ఫీల్డర్లు ప్రేక్షకుల్లా చూస్తుండిపోవాల్సి వచ్చింది.
చివరికి వైభవ్ సూర్యవంశీ 26 బంతుల్లో 78 పరుగులు చేశాడు. వైభవ్ ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లున్నాయి. అంటే 74 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయంటే అతని ఊచకోత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైభవ్ ఔటైన తర్వాత హెట్ మెయిర్(0), రియాన్ పరాగ్(3) పరుగులకే ఔటైనా.. జురెల్ మాత్రం దుమ్మురేపాడు. జడేజాతో కలిసి దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో ఈ సీజన్ లో రెండో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జడేజాతో కలిసి జురెల్ (81) 68 పరుగుల పార్టనర్ షిప్ సాధించాడు. దీంతో రాజస్థాన్ మరో 2 ఓవర్లు మిగిలుండగానే టార్గెట్ను అందుకుంది.
స్కోరు బోర్డు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ : 201/8 ( పటిదార్ 63, కోహ్లీ 32 , వెంకటేశ్ అయ్యర్ 29 ; ఆర్చర్ 2/33, బిష్ణోయ్ 2/32 )
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: 202/4 ( జురెల్ 81 నాటౌట్, వైభవ్ సూర్యవంశీ 78, జడేజా 24 నాటౌట్, కృనాల్ 2/30, హ్యాజిల్ వుడ్ 2/44 )




