నేను చర్చకు సిద్ధం.. చర్చ జరపాలా? రచ్చ చేయాలా?.. ప్రతిపక్షాలపై అమిత్ షా ఎదురుదాడి
ప్రతిపక్షాలపై మంత్రి అమిత్ షా ఎదురుదాడి
విపక్షాలు చర్చకు వస్తారో.. ఆందోళన చేస్తారో తేల్చుకోవాలి
విపక్షాలు చర్చకు రాకుండా ఆందోళన
విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధం
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్(NEET paper leak), ఆందోళన కారులపై పోలీసుల లాఠీ ఛార్జ్ వంటి అంశాలపై పార్లమెంట్లో విపక్షాల ఆందోళనపై కేంద్ర హోంమంత్రి అమిత్షా(Union Home Minister Amit Shah) ఎట్టకేలకు స్పందించారు. వార్తా ఛానెళ్ల ద్వారా ప్రతిపక్షాలకు ఒక విషయం చెబుతున్నానని అమిత్ షా తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల లోపు స్పీకర్ కు ప్రతిపక్షాలు లేఖ రాసి ఇవ్వండి, మధ్యాహ్నం 3 నుంచి చర్చను ప్రారంభిస్తామని కేంద్ర మోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు అన్ని విషయాలకు సంబంధించి సమాధానమిస్తానని సూచించారు.
పార్లమెంట్ లో చర్చకు నిర్దిష్ట నియమాలు, పద్ధతులు ఉన్నాయని వివరించారు. ఇంత తీవ్రమైన సమస్యను పైపైనే చర్చ జరపడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. పార్లమెంట్ లో ఏ అంశంపైనైనా సుదీర్ఘంగా చర్చ జరుగుతోందని అమిత్ షా వెల్లడించారు. ఇవాళ మధ్యాహ్నం 3 నుంచి అర్ధరాత్రి వరకు చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. ప్రతిపక్షాలు ఎంతసేపు సభలో కూర్చుంటే అంతసేపూ చర్చిద్దామని పేర్కొన్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటల వరకైనా చర్చకు మేం సిద్ధమన్నారు.
స్పీకర్ అనుమతిస్తే ప్రశ్నోత్తరాల సమయం రద్దుకూ సిద్ధంగా ఉన్నామని సూచించారు. ''రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు నేను చర్చకు సిద్ధంగా ఉన్నా.. నేనే స్వయంగా సభలో కూర్చుంటా.. ప్రతి అంశాన్ని రాసుకుంటా.. ప్రతి విషయానికి సమాధానం ఇచ్చేందుకు నేను సిద్ధం'' అని పేర్కొన్నారు. దేశ ప్రజల ముందు అన్ని విషయాలు స్పష్టమవుతాయని అమిత్ షా ప్రకటించారు. సభలో చర్చ జరపాలా? లేక రచ్చ చేయాలా? అనేది ప్రతిపక్షాలే తేల్చుకోవాలని అమిత్ షా పేర్కొన్నారు.






