25 May, 2026 | 5:16 AM

వెన్ను పోటుదారు కాంగ్రెస్

25-05-2026 12:00 AM

అధికారం కోసమే టీవీకేతో చేతులు కలిపింది

డీఎంకే యువజన విభాగ కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్

చెన్నై, మే 24: రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ డీఎంకేను వెన్నుపోటు పొడిచిందని ఆ పార్టీని నాయకులు, కార్యకర్తలు ఎన్నటికీ నమ్మొద్దని డీఎంకే నాయకుడు, యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ తీవ్రంగా ఆరోపించారు. ఆదివారం చెన్నైలో జరిగిన డీఎంకే యువజన విభాగం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

20 ఏళ్లుగా తమవెంట ఉన్న హస్తం పార్టీ ఈ రోజు అధికారం కోసం టీవీకేతో చేతులు కలిపిందని విమర్శించారు. ఈ విషయాన్ని ప్రజలు ఎప్పటికీ మరిచిపోవద్దని ఆ పార్టీ నేతలకు భవిష్యత్తులో తమ దరిదాపుల్లోకి కూడా రానివ్వవద్దని సూచించారు. రాజకీయంగా తన ఉనికిని నిలుపుకునేందుకు కాంగ్రెస్ ఎంతటి దారుణానికైనా ఒడిగడుతుందని మరోసారి స్పష్టమైందన్నారు.

దేశంలో బీజేపీ వరుస విజయాలకు ప్రధాని మోదీ, అమిత్ షాలే ప్రధాన కారణమని తాను భావించానని, కానీ అది నిజం కాదని అన్నారు. కాంగ్రెస్ నేతల అసమర్థ విధానాల వల్లే ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని చెప్పారు. డీఎంకేతో పొత్తువల్లే కాంగ్రెస్‌కు గతంలో ఎంపీ, అసెంబ్లీ సీట్లు వచ్చాయన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా డీఎంకే కార్యకర్తల అవిశ్రాంత కృషి వల్లే ఆ పార్టీ ఐదు సీట్లు గెలుచుకోగలిగిందన్నారు.

ఆ విశ్వాసం కూడా లేకుండా కాంగ్రెస్ నేతలు గెలిచిన వెంటనే అధికారం కోసం పరుగులు తీశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. త్వరలోనే తమిళనాడు ప్రజలు కాంగ్రెస్‌కు తగినరీతిలో బుద్ధి చెబుతారని అన్నారు. ఎన్నికల్లో డీఎంకే పరాజయం నేపథ్యంలో పార్టీ వ్యూహాల్లో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కార్యకర్తలకు సూచించారు. జెన్ జెడ్ యువతకు రాజకీయంగా అవగాహన కల్పించాలని, తొలిసారి ఓటు వేసిన వారికి రాజకీయ చైతన్యం కల్పించాలని యువజన విభాగం నేతలకు సూచించారు.