ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణపై బూత్ లెవెల్ సూపరవైజర్లకు శిక్షణ
నిజాంసాగర్, జూన్ 23 (విజయక్రాంతి): జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పిట్లం, మహ్మద్నగర్ నిజాంసాగర్ మండలాలకు చెందిన బూత్ లెవెల్ ఆఫీసర్లు, బూత్ లెవెల్ సూపర్వైజర్లు, బూత్ లెవెల్ ఏజెంట్లు కోసం ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ కార్యక్రమానికి సంబంధించి శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం నాడు జవహర్ నవోదయ విద్యాలయం, నిజాంసాగర్ లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి 013- జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్, నిజాంసాగర్, పిట్లం, మహ్మద్నగర్ మండలాలకు చెందిన అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు తహశీల్దార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలను వివరించారు.
ఓటర్ల వివరాల ఎన్యూమరేషన్ ప్రక్రియను సమగ్రంగా, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. జూన్ 25 నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని, ఓటర్ల వివరాల సేకరణలో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు.
ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న బీఎల్ఓలు, బీఎల్ఎస్లు, బీఎల్ఏలకు ఓటర్ల వివరాల సేకరణ, ధృవీకరణ విధానం, ఫారాల నిర్వహణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అధికారులు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి, ఓటరు జాబితాల నాణ్యతను మెరుగుపరచేందుకు కృషి చేయాలని కోరారు.






