ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలి
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
జిన్నారం/అమీన్పూర్, ఫిబ్రవరి 23:మున్సిపాలిటీలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పాలకవర్గం పని చేయాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తెలిపారు. గడ్డపోతారం మున్సిపాలిటీ తొలి మున్సిపల్ పాలకవర్గం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేసే అవకాశం అతి కొద్ది మందికే లభిస్తుందని.. ప్రజలు అందించిన ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాబోయే ఐదేళ్లపాటు ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని పాలకవర్గానికి సూచించారు.
నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 15 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయడం జరిగిందని..అతి త్వరలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. నిరంతరం వారికి అందుబాటులో ఉంటూ వారి నమ్మకాన్ని చూరగొనా లని కోరారు.
మున్సిపల్ పరిధిలో గల హెట్రో పరిశ్రమ యాజమాన్యం ప్రభుత్వ అనుమతులు లేకుండా 12 ఎకరాల్లో నిర్మాణాలు చేస్తోందని..వెంటనే తొలగించేలా కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేయాలని సూచించారు. ఎమ్మెల్యే సూచనలకు అనుగుణంగా కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గద్దె సుష్మా, వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్, కమిషనర్ వెంకటరామయ్య, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




