విద్యుత్ వ్యవస్థ బలోపేతమే లక్ష్యం
- సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి పర్యటన
- మెరుగైన విద్యుత్ సరఫరాకు ఆదేశాలు
- పలు విద్యుత్ సబ్ స్టేషన్ల పరిశీలన
బెల్లంపల్లి, (విజయ క్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి( ఐఏ ఎస్ )విస్తృతంగా పర్యటించారు. గురువారం బెల్లంపల్లి ప్రాంతంలో పర్యటించి పలు విద్యుత్ మౌలిక సదుపాయాల పనులను పరిశీలించారు. విద్యుత్ సరఫరా నాణ్యతను మరింత మెరుగుపరచడం, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
మొదటగా 132/33 కేవీ బెల్లంపల్లి సబ్స్టేషన్ను పరిశీలించిన సీఎండీ, వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు రెండవ పవర్ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యాన్ని పెంచే చర్యలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తద్వారా భవిష్యత్ విద్యుత్ అవసరాలు సమర్థవంతంగా తీర్చగలమని పేర్కొన్నారు. ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం 33/11 కేవీ బెల్లంపల్లి సబ్స్టేషన్లో రీనోవేషన్ & మోడర్నైజేషన్ (R&M) ప్రతిపాదిత పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత ఏజెన్సీలను , సివిల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కాగజ్నగర్ డివిజన్ లోని దహెగాం నుండి బెల్లంపల్లి డివిజన్ లోని కన్నెపల్లి మధ్యలో 18 కిలోమీటర్ల ఇంటర్లింకింగ్ లైన్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ లైన్ వారంలో అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు . ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా (Alternative Supply) అందుబాటులోకి వచ్చి, అత్యవసర పరిస్థితుల్లో కూడా వినియోగదారులకు విద్యుత్ సరఫరా కొనసాగించవచ్చని తెలిపారు.
అలాగే కన్నెపల్లి సబ్స్టేషన్లో ఆర్&ఎం ప్రతిపాదిత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత ఏజెన్సీలను , సివిల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అక్కడే ఆపరేషన్ సిబ్బంది తో సీఎండీ మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో విద్యుత్ పనులు చేసేటప్పుడు భద్రత అత్యంత కీలకమని, భద్రతపరికరాలు లేకుండా పనులు చేయవద్దని హెచ్చరించారు. క్షేత్ర స్థాయిలో పనులు ప్రారంభించే ముందు ప్రతి ఉద్యోగి కేవలం ఒక నిమిషం సమయం తీసుకుని భద్రతా ప్రమాణాలను సమగ్రంగా పరిశీలించలనన్నారు. ఈ ప్రత్యేక భద్రతా విధానం ద్వారా విద్యుత్ ప్రమాదాలను గణనీయంగా తగ్గించడం, సిబ్బంది ప్రాణాలను రక్షించడం, విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సురక్షితంగా నిర్వహించడం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉన్నందున, ఈ “ఒక్క నిమిషం జాగ్రత్త” సిబ్బంది ప్రాణాలను కాపాడగలదన్నారు.
విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ముత్తాపూర్ (మాడేపల్లి) వద్ద ప్రతిపాదిత 132 కేవీ నూతన సబ్స్టేషన్ స్థలాన్ని ఆయన పరిశీలించారు. భవిష్యత్ పారిశ్రామిక, వ్యవసాయ, గృహ వినియోగ అవసరాలకు అనుగుణంగా ఈ సబ్స్టేషన్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రతిపాదనలను వేగవంతం చేసి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. “వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా నే సంస్థ ప్రధాన లక్ష్యంగా, విద్యుత్ మౌలిక సదుపాయాల బలోపేతం,మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామ న్నారు. ఆయన వెంట మంచిర్యాల సూపరింటెండింగ్ ఇంజినీర్ బి.రాజన్న , డివిజనల్ ఇంజినీర్ టెక్నికల్ మల్లేశం, ఈఈ సివిల్ శ్రీనివాస్ , అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్లు శ్రీనివాస్ , రవికుమార్ , శరత్ కుమార్ , రాంచందర్ , రాజ్ కుమార్ , ఏ.ఈ లు ఇతర ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు.






