కలెక్టరేట్ భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి
రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క
ములుగు, ఫిబ్రవరి25 (విజయక్రాంతి): ములుగు జిల్లా కేంద్రానికి సమీపంలోని డిగ్రీ కళాశాల సమీపంలో నిర్మిస్తున్న కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అధికారులకు, ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా సుందరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, గ్రంధాలయ చైర్మన్ బానోతు రవి చందర్, ములుగు మున్సిపల్ చైర్మన్ చింతనిప్పుల చంద్రకళతో కలసి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అన్ని నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలని, అనుకున్న సమయానికి ముందుగానే అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.




