18-02-2026 10:44:57 AM
కేసు వివరాలు వెల్లడించిన ఎస్ఐ మేడా ప్రసాద్
బూర్గంపాడు,(విజయక్రాంతి): బీమా సొమ్ము కోసం స్నేహితుడిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను బూర్గంపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఐ మేడా ప్రసాద్ కేసు వివరాలను వెల్లడించారు. ఏపీలోని ఎటపాక మండలం గన్నవరం గ్రామానికి చెందిన కట్టా యశ్వంత్ ఈనెల14న రాత్రి మండల పరిధిలోని మోతే పట్టీనగర్ సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ప్రమాదానికి గురై ఆసుపత్రి పాలయ్యాడని తెలుసుకుని యశ్వంత్ అత్త ములిశెట్టి రమ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, అవి రోడ్డు ప్రమాదానికి గురై తగిలిన దెబ్బలు కావని భద్రాచలానికి చెందిన కట్టా సాయిదీపక్, భానుప్రకాష్ అనే వ్యక్తులు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం హత్యాయత్నం చేశారని అనుమానం వ్యక్తం చేశారన్నారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామన్నారు.
అయితే మంగళవారం సాయంత్రం కట్టా సాయిదీపక్, భానుప్రకాష్ లు కారులో వెళుతుండగా వారిని అదుపులోకి తీసుకుని విచారించగా యశ్వంత్ కు వారిద్దరూ స్నేహితులుగా చెప్పారన్నారు. భానుప్రకాష్ యాక్సెస్ బ్యాంకులో సేల్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడని గత ఏడాది నవంబర్ నెలలో కట్టా యశ్వంత్ పేరుమీద వీరిద్దరూ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని నామినీగా కట్టా సాయిదీపక్ కు ఉన్నారన్నారు. పథకం ప్రకారం 14న రాత్రి కట్టా యశ్వంత్ ను మోతే సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు తీసుకువెళ్లి అక్కడ అతనికి మద్యం తాగించారు. తిరిగి స్కూటీపై ఎక్కే సమయంలో వెనుక నుంచి రాడ్డుతో యశ్వంత్ పై దాడిచేసి హత్యాప్రయత్నం చేశారన్నారు. అయితే అతను చనిపోతే రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి తనకు వచ్చే రూ.2కోట్ల బీమా సొమ్ము తీసుకోవచ్చని ఈ నేరానికి పాల్పడినట్లు నేరం అంగీకరించారని ఎస్ఐ తెలిపారు. హత్యాయత్నానికి కారణమైన సాయిదీపక్, భానుప్రకాష్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.