ప్రభుత్వ పాఠశాలకు వన్నె తెచ్చిన వెన్నల
స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా ప్రోత్సాహం
మండలంలో ప్రతిభ చాటిన విద్యార్థిని
కల్లూరు,(విజయక్రాంతి): కల్లూరు మండలం చండ్రుపట్ల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యనభ్యసించిన రామిశెట్టి సాయి వెన్నల ఎస్ఎస్సీ పరీక్షల్లో 571 మార్కులు సాధించి మండల స్థాయి ర్యాంక్ సాధించింది. అలాగే బాసర ఐఐఐటీలో సీటు సాధించి తన ప్రతిభను చాటుకుంది.ప్రభుత్వ పాఠశాలకు వన్నెతెచ్చిన ఈ విద్యార్థినిని ప్రోత్సహించేందుకు స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నర్సింగ్ (USA) ధాత సహకారంతో రూ.15,200 ఆర్థిక సహాయాన్ని అందించారు.
ఈ సహాయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ కాటంనేని విజయలక్ష్మి వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్ రాధాకృష్ణ,అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ నాగమణి, స్ఫూర్తి ఫౌండేషన్ కమిటీ సభ్యులు కలిసి విద్యార్థిని రామిశెట్టి సాయి వెన్నల (రామారావు కుమార్తె)కు చెక్కు రూపంలో అందజేశారు.ఈ సందర్భంగా స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్కు, ధాతలకు విద్యార్థిని తల్లి, గ్రామ పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, స్ఫూర్తి ఫౌండేషన్ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు కాటంనేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.






