TGSWRJC CET Results: జేసీసెట్ ఎంట్రెన్స్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల(TG Social Welfare JCCET Results 2026 ) జూనియర్ కాలేజీల ప్రవేశాల కోసం మొదటి దశలో 18,401 మంది విద్యార్థులు ఎంపికైనట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్(Minister Adluri Laxman) శుక్రవారం సచివాలయంలో TGSWRJC CET-2026 ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 229 సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో MPC, BiPC, MEC, CEC, HEC వంటి కోర్సులతో పాటు వృత్తి విద్యా కోర్సులను అందిస్తూ, మొత్తం 19,740 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రవేశాల కోసం 45,357 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, ఈ నెల 15న నిర్వహించిన జేసీ సెట్ పరీక్షకు 39,052 మంది విద్యార్థులు హాజరుకాగా తొలి విడతలో 18,401 మంది సీట్లు సాధించారు. మొదటి దశలో ఎంపికైన విద్యార్థులు జూన్ 7వ తేదీలోగా తమ ప్రవేశ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని మంత్రి లక్ష్మణ్ తెలిపారు. గురుకుల విద్యాసంస్థల పట్ల విద్యార్థులకు, తల్లిదండ్రులకు అపారమైన నమ్మకం ఉందని పేర్కొన్న ఆయన, ఉన్నత ప్రమాణాలను పాటించాలని అధికారులను ఆదేశించారు. ఫుడ్ పాయిజన్(Food Poisoning) వంటి సంఘటనలు పునరావృతం కాకుండా నివారించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గతంలో జరిగిన లోపాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్నట్లు కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు.






