తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను 30 నెలలైనా నెరవేర్చలేదు
బీజేపీ నేత సందీప్ రాథోడ్
జైనూర్, మే 23 (విజయక్రాంతి): ప్రభుత్వం కొలువుదీరి 30 నెలలు గడుస్తున్నా నిరుద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, వెంటనే జాబ్ క్యాలెండర్, నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ నాయకుడు సందీప్ రాథోడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా 'నిరుద్యోగ గర్జన' పేరుతో ఉధృత పోరాటాలు చేపడతామని శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆయన విమర్శించారు.
ఇప్పటివరకు వచ్చిన ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి తప్ప క్షేత్రస్థాయిలో ఉద్యోగాల భర్తీ జరగలేదు అని ఆరోపించారు.నిరుద్యోగుల వయోపరిమితి, మానసిక ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ను వెంటనే ప్రకటించి ఇచ్చిన హామీలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన ప్రభుత్వం వారి భవిష్యత్తుతో ఆడుకుంటే చూస్తూ ఊరుకోబోం. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. లేని పక్షంలో ధర్నాలు, రాస్తారోకోలు, అసెంబ్లీ ముట్టడి వంటి ఉధృత పోరాటాలు చేపడతాం అని సందీప్ రాథోడ్ హెచ్చరించారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి నిరుద్యోగ లోకానికి న్యాయం చేయాలని ఆయన అన్నారు.






