అమెరికాలో తీన్మార్ మల్లన్న పర్యటన
న్యూ జెర్సీలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అమెరికా పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం న్యూ జెర్సీ రాష్ట్రంలో ప్రవాస తెలంగాణ వాసులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. న్యూ జెర్సీలోని ప్రిన్స్స్టన్ గోదావరి రెస్టారెంట్లో వెంకట్ మారోజు, రమేష్, తెలంగాణ వేణు, రాజ్ తోట ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
మల్లన్న వెంట తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లబోయిన అశోక్ ముదిరాజ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. బీసీలకు దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్ఆర్ఐలకు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వర్గాల ఆధిపత్యం ఎలా కొనసాగుతోందో మరీ ముఖ్యంగా రెడ్ల డామినేషన్ ఏ విధంగా ఉందో గణాంకాలతో సహా వివరించారు.
అలాగే, బీసీల రాజకీయ సాధికారత కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఎందుకు స్థాపించాల్సి వచ్చిందో వివరిస్తూ, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, బీసీ ఉద్యమ దిశ, భవిష్యత్ కార్యా చరణపై సుదీర్ఘంగా వారితో మాట్లాడారు. ఈ సమా వేశంలో పాల్గొన్న ప్రవాస భారతీయులు తమ అభిప్రాయాలను మల్లన్నతో పంచుకుంటూ, బీసీల ఐక్యత, రాజకీయ సాధికారత కోసం చేపడుతున్న ఉద్యమానికి మద్దతు తెలిపారు. మల్లన్న చేస్తున్న పోరాటానికి తమ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు.






