ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని సద్వినియోగం చేసుకోండి
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికపై అవగాహన సదస్సు
హనుమకొండ, (విజయక్రాంతి): జిల్లా అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”(Praja Palana – Pragathi Pranalika) 99 రోజుల కార్యాచరణపై గ్రామీణ, పట్టణ ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించే కార్యక్రమం హనుమకొండ జిల్లా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించారు. ఈ అవగాహన సదస్సును వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి , నగర మేయర్ గుండు సుధారాణి , జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రభుత్వం రూపొందించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చేలా రూపొందించబడిందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేయడం ఈ కార్యాచరణ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించి అభివృద్ధి పనులను సమయానికి పూర్తి చేయడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, అదనపు కలెక్టర్ రవి, డీఆర్డీఏ అధికారి మేన శ్రీను, ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు కార్పొరేటర్ మానస రాంప్రసాద్, జక్కుల రవీందర్,విజయశ్రీ రజాలి,మామిండ్ల రాజు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.




