17-02-2026 04:45:20 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని దోమకొండ ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, ఎస్ఎస్కె కేంద్రం, వైఆర్జీ లింక్ వర్కర్స్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం దోమకొండ మండల కేంద్రంలో వార్డు సభ్యుల శిక్షణ తరగతుల కార్యక్రమంలో పలు ఆరోగ్య విషయాలపై ఆయా సంస్థల ప్రతినిధులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ హాజరై మాట్లాడారు. ఐసీటీసీ కౌన్సిలర్ మేక నాగరాజు, ఎస్ ఎస్ కే మేనేజర్ శ్రీనివాస్ గౌడ్ లు హెచ్ఐవీ, ఎయిడ్స్, సుఖ వ్యాధులు, హెచ్బీఎస్ ఏజీ, హెచ్సీవీ, ఆర్బీఎస్, ఎంపీ, డెంగ్యూ, చాతి సమస్యలు, టిబి లక్షణాలు, 1097 సేవల గురించి అవగాహన కల్పించారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయా సేవలను వినియోగించుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శులు, టి ఓ టి లు అల్లాడి రమేష్, తిరుపతి, యాకూబ్, పి రమేష్, ఎస్ ఎస్ కె ఔట్రిచ్ వర్కర్లు కృష్ణమూర్తి, శ్వేత, లింక్ వర్కర్ బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.