13-02-2026 12:40:25 AM
జనగామ, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): జనగాం, స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ లకు సంబందించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కి ఏర్పాట్లు పూర్తి అయ్యాయని.. కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు.రేపు జరగనున్న మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పైన సంబంధిత అధికారులతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం గూగుల్ మీటింగ్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం అయ్యేఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నియమావళి ప్రకారం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించాలన్నారు.లెక్కింపు ప్రక్రియలో ప్రతి దశను స్పష్టంగా అమలు చేసే విధంగా అధికారులు, రిటర్నింగ్ అధికారులు , సహాయ రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్వైజర్లు సిబ్బందికి ముందస్తుగా శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. లెక్కింపు కేంద్రం వద్ద మూడు స్థాయిల లో భద్రతా ఏర్పాట్లు చేశామని సీసీ కెమెరాల పర్యవేక్షణలో మొత్తం ప్రక్రియ కొనసాగుతుందని అభ్యర్థులు, వారి ఎన్నికల ఏజెంట్లకు గుర్తింపు కార్డుల ఆధారంగా ప్రవేశం కల్పించేలా చూడాలన్నారు.
స్ట్రాంగ్ రూమ్ను అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలోనే తెరవాలన్నారు.లెక్కింపు ప్రక్రియలో మొదటగా పోస్టల్ బ్యాలెట్ పేపర్లను లెక్కింపు ఉంటుందని పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనంతరం.... పోలింగ్ కేంద్రాల్లో వినియోగించిన బ్యాలెట్ బాక్స్లను అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో తెరిచి లెక్కింపు ప్రారంభించాలన్నారు. కౌంటింగ్ ప్రశాంతం గా ముగిసేలా అధికారులు వారి విధులను సక్రమంగా,బాధ్యతాయుతంగా వ్యవహారించాలన్నారు.ఈ వీసీ లో ఆర్డివో లు, మాస్టర్ ట్రైనర్లు, ఆర్వో లు, ఏ ఆర్వో లు, కౌంటింగ్ సూపరవైజర్ లు, కౌంటింగ్ అసిస్టెంట్ లు తదితరులు పాల్గొన్నారు.