ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలి
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం శేఖర్ డిమాండ్
రంగారెడ్డి,జూన్ 16(విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల ఇష్టారాజ్య ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లో జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య వ్యాపారంగా మారిందని, కార్పొరేట్ సంస్థలు విద్యార్థుల నుంచి జలగల డబ్బులు పీడిస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పుస్తకాలు, యూనిఫారాలు, రవాణా పేరుతో ప్రైవేట్ స్కూళ్లు తల్లిదండ్రులను నిలువునా దోచుకుంటున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జీవో నంబర్ 20 ప్రకారం ప్రైవేట్ విద్యాసంస్థల్లో పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్లు కేటాయించే విద్యా హక్కు చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలన్నారు.
ఫీజులను అదుపు చేయడానికి 'స్వతంత్ర ఫీజు రెగ్యులేటరీ కమిషన్' ఏర్పాటు చేసి, అధిక ఫీజులు వసూలు చేసే స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.విద్యను వ్యాపారంగా మార్చడం ఆపాలని, ప్రభుత్వం స్పందించకపోతే తల్లిదండ్రులు, ప్రజాసంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఎస్పీ ముఖ్య నాయకులు, జోనల్ ఇంచార్జ్లు, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.






