యాదగిరిగుట్ట పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
మార్నింగ్ వాక్లో ప్రజా సమస్యలు తెలుసుకున్న ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
పాత గుట్ట కల్లు కాంపౌండ్ లో కల్లు తాగిన ప్రభుత్వ విప్
యాదగిరిగుట్ట, ఆగస్టు 7 (విజయక్రాతి): యాదగిరిగుట్ట పట్టణ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా విప్ బీర్ల అయిలయ్య శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో స్వయంగా పర్యటిస్తూ అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాతగుట్ట రోడ్డు, బీసీ కాలనీ, నల్లచెరువు, అంగడి బజార్, బాలికల వసతి గృహం, పెద్దమోరి తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య విస్తృతంగా పర్యటించారు. గుండ్లపల్లి లోని
నల్లచెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. పెద్దమోరి ప్రాంతానికి సంబంధించిన పలు అంశాలపై అధికారులతో చర్చించారు. బీసీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన చేశారు. బాలికల వసతి గృహంలో విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. విద్యార్థులకు కుర్చీలు, ప్లేట్లు, నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాదగిరిపల్లి, అంగడి బజార్ ప్రాంతాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణానికి అనువైన స్థలాల కోసం ఎమ్మెల్యే పరిశీలన చేశారు. పాతగుట్ట వద్ద ఉన్న కల్లు కాంపౌండ్ను సందర్శించిన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గౌడ్ అన్నలతో ఆత్మీయంగా మాట్లాడారు. వారి కోరిక మేరకు కల్లును స్వీకరించారు. గౌడ్ వృత్తిదారుల సమస్యలను తెలుసుకుని వారికి అండగా ఉంటామని తెలిపారు.






