కళ్యాణ లక్ష్మి చెక్కు కోసం అత్తమామలపై అల్లుళ్ల దాడి
- ముగ్గురికి తీవ్ర గాయాలు.. పోలీసుల అదుపులో నిందితులు
గజ్వేల్: సిద్దిపేట జిల్లా దిలాల్పూర్ గ్రామంలో అదనపు కట్నం, కళ్యాణ లక్ష్మి చెక్కు కోసం ఇద్దరు అల్లుళ్లు కలిసి అత్త, మామ, భార్యపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన రాచకొండ నర్సింలు, నాగమణి దంపతులు తమకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు ఉండగా, పెద్ద కుమార్తె లలితను వడ్డేపల్లి గ్రామానికి చెందిన శ్యాం కుమార్కు, చిన్న కుమార్తె అనితను వేములఘాట్ గ్రామానికి చెందిన అరుణ్కు
ఇచ్చి వివాహం చేశారు. లలిత భర్త శ్యాం కుమార్ కొంతకాలంగా అదనపు కట్నం కోసం భార్యను, అత్తమామలను వేధిస్తున్నాడని లలిత ఆరోపించింది. అలాగే అరుణ్ కళ్యాణ లక్ష్మి చెక్కు డబ్బుల కోసం అత్తమామలను వేధిస్తున్నాడని బాధితులు తెలిపారు. ఈ క్రమంలో శ్యాం కుమార్, అరుణ్ ఇద్దరూ పథకం ప్రకారం నర్సింలు, నాగమణి, లలితలపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, గ్రామస్తులు వెంటనే గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు శ్యాం కుమార్, అరుణ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.






