క్రీడారంగంలో కల్లూరు గర్వకారణం
కల్లూరు,(విజయక్రాంతి): కల్లూరు మండలం శాంతినగర్ హరిజనవాడ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఇద్దరు చిన్నారులు రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాలలకు ఎంపిక కావడంతో స్థానికంగా ఆనందం వ్యక్తమవుతోంది.మూడవ తరగతి చదువుతున్న ఖమ్మంపాటి మహన్య (తండ్రి: అశోక్),కాకటి లక్ష్మీ ప్రసన్న (తండ్రి: నరసింహారావు) తమ ప్రతిభతో రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాలల ఎంపికల్లో అర్హత సాధించారు. ఈనెల 13, 14 తేదీలలో హకీంపేట క్రీడా పాఠశాలలో జరిగే అడ్మిషన్ ప్రక్రియకు హాజరుకానున్నారు.విద్యార్థుల విజయంపై కల్లూరు మండల విద్యాశాఖ అధికారి పత్తిపాటి నివేదిత, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధురి, సహోపాధ్యాయులు గుర్రాల సుధీర్, శాంతినగర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
అలాగే క్రీడా నిపుణులు తుంబూరు సునీల్ రెడ్డి,స్టేడియం అడ్మినిస్ట్రేటర్ పసుపులేటి వీర రాఘవయ్య,కోచ్లు టీ గౌతమ్, ఎన్ గోపాల్,జి శ్రీనివాస్,ఫిజికల్ ట్రైనర్ నాగబాబు తదితరులు ఈ విద్యార్థులకు శిక్షణ అందించి ప్రోత్సహించినట్లు తెలిపారు. కల్లూరు గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియంలో సాధన చేసి రాష్ట్రస్థాయికి ఎదిగిన ఈ చిన్నారులను గ్రామ పెద్దలు, స్థానికులు అభినందించి ఆశీర్వదించారు.ఈ విజయంతో కల్లూరు క్రీడారంగానికి మరో మైలురాయి చేరిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.






