తీవ్ర విషాదం: బోల్తా పడిన ట్రాక్టర్— ఆరుగురు మృతి
అనుప్పూర్: మధ్యప్రదేశ్లోని(Madhya Pradesh) అనుప్పూర్ జిల్లాలో ఒక ట్రాక్టర్-ట్రాలీ బోల్తా పడటంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, మరో 40 మంది గాయపడ్డారు. బిజౌరా గ్రామంలో జరగనున్న ఒక మతపరమైన కార్యక్రమానికి ఈ వాహనం సుమారు 50 మందిని తీసుకువెళుతోందని అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జగన్నాథ్ మార్కం పేర్కొన్నారు.
డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో బిజౌరా గ్రామం సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బాధితుల్లో కొందరు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారికి ఉమరియాలోని పాలి కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం, వైద్య కళాశాలలో చికిత్స అందిస్తున్నారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు సహాయం కింద ఒక్కో కుటుంబానికి రూ. 4 లక్షల చొప్పున అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.






