17-02-2026 01:08:24 AM
వైస్ చైర్ పర్సన్గా భాగ్యలక్ష్మి
బిచ్కుంద, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీలో సోమవారం జరిగిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి మరో విజయాన్ని అందించాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 12 వార్డుల్లో 10 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుని ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావు పట్టణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా నిబద్ధతతో పనిచేస్తున్న షేట్కార్ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన కౌన్సిలర్ల అభిప్రాయం మేరకు సీమా రమేష్ షేట్కార్ ను మున్సిపల్ చైర్మన్ గా అధికారికంగా ప్రకటించారు. అలాగే వైస్ చైర్మన్ గా బాగ్యాలక్ష్మి ప్రేమ్ సెట్ను ఎన్నుకున్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల అధికారుల సమక్షంలో చైర్మన్, వైస్ చైర్మన్ లు బాధ్యతలు స్వీకరించి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్ పర్సన్ సీమా షట్కార్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, పారదర్శక పరిపాలన తమ లక్ష్యమని నూతన చైర్మన్ సీమా రమేష్ షేట్కార్ తెలిపారు. బిచ్కుంద పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.