రైతులకు రాయితీపై విత్తనాలు, రసాయనాలు
అధిక దిగుబడుల కోసం సాంద్ర సాగు పద్ధతులు పాటించాలి
జిల్లా వ్యవసాయ అధికారి వెంకట్
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలోని రైతులకు పంట సాగుకు అవసరమైన రాయితీ విత్తనాలు, రసాయనాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి వెంకట్ తెలిపారు. పత్తి పంటలో ఉత్పత్తి, దిగుబడులను గణనీయంగా పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే ఐదేళ్లకు ప్రత్యేక ప్రణాళికలతో నూతన పథకాలను అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు.
ఎకరాకు 6 విత్తన ప్యాకెట్లు వినియోగిస్తూ అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయాలని, దగ్గర దగ్గరగా నాటే విధానంలో 4 విత్తన ప్యాకెట్లు వినియోగించవచ్చని సూచించారు.సమగ్ర పంటల యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా పంట దిగుబడులు మెరుగుపడతాయని తెలిపారు. రైతులు ప్రభుత్వం అందిస్తున్న రాయితీ విత్తనాలు, రసాయనాలను వినియోగించుకోవడంతో పాటు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలని కోరారు.పత్తి సాగులో ఆధునిక పద్ధతులను అనుసరించడం ద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గి, లాభాలు పెరిగే అవకాశముందని వివరించారు.






