అనురాగ్ యూనివర్సిటీలో 'SEATNGA-2026' అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ప్రారంభం
ఘట్ కేసర్: అనురాగ్ యూనివర్సిటీలోని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో "సస్టైనబుల్ ఎనర్జీ అండ్ ఏఐ టెక్నాలజీస్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ అప్లికేషన్స్ అనే అంశంపై రెండు రోజుల పాటు జరిగే మొదటి అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ఈ-బ్లాక్ ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభమైంది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ ఆటోమోటివ్ ఈవి విభాగం డైరెక్టర్ గోపాల కృష్ణన్ వీసీ హాజరయ్యారు. గౌరవ అతిథిగా ఎంటర్ప్రైజ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ బి. కిరణ్ బాబు విచ్చేశారు.
వైస్ ఛాన్సలర్ డాక్టర్ అర్చన మంత్రి మాట్లాడుతూ... మారుతున్న సాంకేతిక కాలంలో విద్యార్థులు, పరిశోధకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్థిరమైన ఇంధన వనరుల ప్రాధాన్యతను గుర్తించాలని పిలుపునిచ్చారు. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డీన్ డాక్టర్ విజయ్ కుమార్ ఇంజనీరింగ్ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను వివరించారు. ఎలక్ట్రికల్ విభాగం అధిపతి డాక్టర్ మహమ్మద్ యాసీన్ ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశ్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమ నిర్వహణలో కాన్ఫరెన్స్ చైర్ పర్సన్స్ డాక్టర్ టి. అనిల్ కుమార్, డాక్టర్ హరీష్, డాక్టర్ శ్రీకాంత్ గౌడ్ కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.






