పేకాట స్థావరంపై పోలీసుల దాడి
నలుగురు అరెస్ట్, ఇద్దరు పరారీ
రూ.13,500 నగదు, రెండు బైక్లు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం
పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి మండలం అందుగులపల్లి గ్రామ శివారులోని ఎస్ఆర్ఎస్పీ కాలువ సమీపంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పెద్దపల్లి రూరల్ పోలీసులు శుక్రవారం ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో నలుగురిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారైనట్లు పోలీసులు తెలిపారు. పేకాట జరుగుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పెద్దపల్లి రూరల్ ఎస్ఐ మధుకర్ తన సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు.
ఘటనాస్థలిలో రాణాపూర్కు చెందిన అంబటి తరుణ్ (33), కనగర్తికి చెందిన సార్ల అంజి (30), అందుగులపల్లికి చెందిన భూమ అనిల్ (29), బసంత్నగర్కు చెందిన గండికోట రాజేందర్ (29)లను అదుపులోకి తీసుకున్నారు. అయితే బసంత్నగర్కు చెందిన సార్ల అశోక్, జీడీనగర్కు చెందిన తపళ్ళ సతీష్ పోలీసులను గమనించి పరారయ్యారు. నిందితుల వద్ద నుంచి రూ.13,500 నగదు, రెండు మోటార్సైకిళ్లు, నాలుగు మొబైల్ ఫోన్లు, పేకాట పత్తాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పెద్దపల్లి రూరల్ పోలీసులు వెల్లడించారు.






