26 March, 2026 | 4:25 AM

నేతన్నలను కాపాడండి

26-03-2026 01:27 AM

సిరిసిల్లలో 38 కోట్ల విద్యుత్ భారం రద్దు చేయాలి

డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మలకు బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ విజ్ఞప్తి

హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి) : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను చుట్టుము ట్టిన విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను కాపాడాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవా రం అసెంబ్లీ ఆవరణలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సంద ర్భంగా సిరిసిల్ల పవర్లూమ్ యూనిట్లపై ఉన్న విద్యుత్ బకాయిలు, సర్‌ఛార్జీలను మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

సిరిసిల్ల పట్టణం రాష్ట్ర వస్త్ర పరిశ్రమకు గుండెకాయ వంటిదని, గతంలో ఇక్కడ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడిన చేదు జ్ఞాపకాలను కేటీ ఆర్ ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో 25 హెచ్‌పీ వరకు విద్యుత్ సబ్సిడీ పెంచడం వల్ల పరిశ్రమ నిలదొక్కుకుందని, అయితే ప్రస్తు తం విద్యుత్ అధికారులు విధిస్తున్న ’బ్యాక్ బిల్లింగ్’ భారం వల్ల వేలాది కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడిందని ఆయన వివరించారు.

2016 నుంచి 2024 వరకు ఉన్న కాలానికి సంబంధించి సుమారు 127 ఎస్‌ఎస్‌ఐ యూనిట్లపై అధికారులు రూ. 19 కోట్ల బ్యాక్ బిల్లింగ్ భారం మోపారని, అది సర్‌ఛార్జీలతో కలిపి ఇప్పుడు రూ. 38 కోట్లకు చేరిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ భారీ బకాయిలను చెల్లించలేక అనేక యూనిట్లు మూతపడటంతో పాటు, ఇటీవల కాలంలో ఆర్థిక ఇబ్బందులతో 13 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ బిల్లుల భారాన్ని మానవీయ కోణంలో రద్దు చేసి నేతన్నను అదుకోవాలన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను, కార్మికుల ఉపాధిని రక్షించేందుకు ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ఉన్న బ్యాక్ బిల్లింగ్, సర్‌ఛార్జీల మొత్తాలను పూర్తిగా మాఫీ చేయాలని, పాత బకాయిలతో సంబంధం లేకుండా, పరిశ్రమకు నిరంతరాయంగా విద్యుత్ సబ్సిడీ ప్రయోజనాలు అందేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

కార్మికులు మళ్లీ ఆత్మహత్యలు చేసుకోకుండా తక్షణ ఆర్థిక వెసులుబాటు కల్పించాలని, సిరిసిల్ల నేతన్నల సమస్య కేవలం ఒక ప్రాంతానిది కాదని, అది వేలాది కుటుంబాల మనుగడకు సంబంధించినదని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్సీ ఎల్ రమణ కూడా ఉన్నారు.