ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి నేడు జిల్లా కేంద్రంలో తపస్ ధర్నా
విజయవంతం చేయాలి: శెట్పల్లి శ్రీనివాసులు శర్మ
దోమకొండ,(విజయక్రాంతి): తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ నెల 14వ తేదీ మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తపస్ జిల్లా కార్యదర్శి శెట్పల్లి శ్రీనివాసులు శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం తపస్ రాష్ట్ర శాఖ దశలవారీ ఉద్యమాన్ని చేపట్టిందన్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే మండలాల వారీగా తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు.గత ప్రభుత్వం తొలి విడతలో 43 శాతం, రెండో విడతలో 30 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రస్తుత ప్రభుత్వం వెంటనే ఆరు డీఏలను విడుదల చేయాలని, పీఆర్సీ నివేదికను తెప్పించి 51 శాతం ఫిట్మెంట్తో కొత్త పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే జీవో నెం.25ను సవరించి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న వంట ఏజెన్సీలకు పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు.
ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ బాధ్యతల నుంచి మినహాయించాలని, జీవో నెం.317 ప్రకారం బదిలీలకు దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.పై డిమాండ్ల సాధన కోసం ఈ నెల 14న కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించే ధర్నా కార్యక్రమానికి జిల్లాలోని ఉపాధ్యాయులందరూ పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని శెట్పల్లి శ్రీనివాసులు శర్మ పిలుపునిచ్చారు.






