క్యూరింగ్ క్రమం తప్పకుండా చేయాలి
– సర్పంచ్ బుర్సా పోచయ్య
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు జూబ్లీ మార్కెట్ ప్రాంతంలో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్లకు క్యూరింగ్ (నీరు పోయడం) పనులను క్రమం తప్పకుండా చేపట్టాలని రాజంపేట గ్రామ సర్పంచ్ బుర్సా పోచయ్య సూచించారు. సోమవారం ఆయన బిల్ కలెక్టర్ నాగేంద్ర, వార్డు సభ్యుల ఫోరం జిల్లా అధ్యక్షుడు గులాం జావిద్తో కలిసి సీసీ రోడ్లను పరిశీలించి క్యూరింగ్ పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... సీసీ రోడ్లు దీర్ఘకాలం మన్నికగా ఉండాలంటే నిర్మాణం అనంతరం నిరంతరంగా క్యూరింగ్ నిర్వహించడం అత్యంత ముఖ్యమని అన్నారు. నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ పనులు చేపట్టాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ప్రజాధనం వృథా కాకుండా ప్రతి అభివృద్ధి పనిని నాణ్యతతో పూర్తి చేయడమే గ్రామపంచాయతీ లక్ష్యమని పేర్కొన్నారు.గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రజలకు శాశ్వత ప్రయోజనం చేకూరే విధంగా మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.






