రాహుల్ ఆదర్శప్రాయులు
భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం
అందరి సహకారంతోనే అభివృద్ధి : రాహుల్ ఐఏఎస్
భద్రాచలం,(విజయ క్రాంతి): ఒక అధికారి ప్రజా సేవను తన శ్వాసగా భావిస్తే ఆ ప్రాంతం ఎలా మారుతుందో చెప్పడానికి భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్ ప్రత్యక్ష నిదర్శనం అని శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రశంసించారు. సోమవారం ఐటీడీఏ సమావేశ హాల్లో నిర్వహించిన ఐటీడీఏ పీవో రాహుల్ రెండేళ్ల పాలన సక్సెస్ మీటిలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత రెండేళ్లలో ఆయన తన కార్యక్షేత్రంలో సృష్టించిన విప్లవాత్మక మార్పులు, వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లో నూతన ఆశలను చిగురింపజేశాయి.
అన్నారు.పరిపాలన అంటే కేవలం ఫైళ్లకు పరిమితం కాదని, అది అట్టడుగు వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఒక సాధనమని పిఓ రాహుల్ నిరూపించారన్నారు. గిరిజన సంస్కృతికి పట్టం కడుతూనే, ఆధునిక విద్య మరియు ఉపాధి రంగాల్లో మన గిరిజన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా ఆయన చేసిన కృషి అనన్యం అన్నారు.విద్య, వైద్యం, వసతి, క్రీడలు మరియు సంస్కృతి అనే ఐదు ప్రధాన సూత్రాలతో ఆయన నిర్మించిన ‘గిరిజన వికాస సౌధం’ నేడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందటం తనకెంతో గర్వకారణంగా ఉందన్నారు. ఆదివాసీల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ ప్రజా బాంధవుడి ప్రస్థానం, భావి తరాలకు ఒక స్ఫూర్తిదాయక పాఠం అని అభినందించారు
అందరి సహకారంతోనే సక్సెస్ : పిఓ రాహుల్
అందరి సహకారంతోనే భద్రాచలం ఐటీడీఏని ముందుకు తీసుకు వెళ్ళటం జరిగిందని ఐటీడీఏ పీవో బి. రాహుల్ వెల్లడించారు. ప్రధానంగా జిల్లా శాసనసభ్యులు కూడా ఎంతగానో సహకరించారని తెలిపారు. యూనిట్ అధికారులు కూడా బాధ్యతాయుతంగా పనిచేశారని ప్రశంసించారు. ఐటీడీఏ లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు గిరిజన అభివృద్ధిలో చేయి చేయి కలిపారని తెలిపారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంచేందుకు ‘ఉద్దీపకం’ కార్యక్రమాన్ని అమలు చేశామన్నారు.
ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీష్, అర్థమెటిక్, తెలుగు భాషలపై పట్టు సాధించేలా ప్రత్యేక పుస్తకాలను రూపొందించడం వల్ల, ఏకంగా 90% మంది విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధించారన్నారు.విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యాలను తీర్చిదిద్దేందుకు కెరీర్ అవేర్ నెస్ ప్లెక్సీలను విద్యాసంస్థల్లో ఏర్పాటు చేయగా అవి ఎంతగానో సక్సెస్ ఇచ్చాయని పేర్కొన్నారు.క్రీడల్లో గిరిజన విద్యార్థుల ప్రతిభను వెలికితీస్తూ వారిని ప్రోత్సహించటం జరిగిందని సత్ఫలితాలు పాజిటివ్ గా వచ్చాయన్నారు.గిరిజన మ్యూజియంను ఆధునీకరించి, 1.5 లక్షల మంది సందర్శకులను ఆకర్షించేలా తీర్చిదిద్దడమే కాకుండా, ‘తెలంగాణ రాష్ట్ర గ్రామీణ పర్యాటక పురస్కారాన్ని’ ఢిల్లీ నుంచి రూ. 1 కోటి నిధులను అందుకోవటం సంతోషాన్ని ఇచ్చింది అన్నారు.
గిరిజన ఇలవేల్పుల చరిత్రను తెలిపే పుస్తకాన్ని వెలుగులోకి తేవటం కూడా సంతోషకరమన్నారు. గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పిస్తూ ప్రారంభించిన ‘భద్రగిరి మార్ట్’, నేడు గిరిజన కుటుంబాలకు ఆర్థికబి భరోసానిచ్చే ప్రధాన వేదికగా మారిందన్నారు. భద్రాచలం శాసనసభ్యులు ఐటీడీఏ యూనిట్ అధికారులు సిబ్బంది సమక్షంలో ఐటీడీఏ పీవో సాధించిన ప్రగతి పోస్టర్ ఆవిష్కరించారు. అందరి సమక్షంలో రెండు సంవత్సరాలు పూర్తి చేసినందున కేక్ కట్ చేసి ఐటిడిఏ పీఓకు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.






