మావోయిస్టు పార్టీలో పనిచేసి లొంగిపోయి సభ్యులకు రివార్డులను అందజేత
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ఇటీవల పోలీసులు ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పార్టీకి చెందిన వివిధ క్యాడర్లకు చెందిన 10 మంది సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంజూరైన రివార్డులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం అందజేశారు. మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న సమయంలో వారి క్యాడర్ ను బట్టి తెలంగాణ ప్రభుత్వం రివార్డులను ప్రకటించింది. 10 మంది సభ్యులకు గాను మొత్తం రూ 55,60,000/-(యాభై ఐదు లక్షలు) లను ఎస్పీ చెక్కుల రూపంలో అందజేశారు.
రివార్డులను అందుకున్న వారిలో స్టేట్ కమిటీ మెంబెర్ - 01,డివిజనల్ కమిటీ మెంబర్స్ - 01, ఏరియా కమిటీ మెంబెర్స్ - 06, దళ సభ్యులు - 02 లు ఉన్నారు.ప్రస్తుతం వారి స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. రివార్డులను అందుకున్న సభ్యులకు ఎస్పీ కొన్ని సూచనలను చేశారు.రివార్డుల ద్వారా అందుకున్న నగదును విలాసాలకు ఉపయోగించకుండా, సక్రమ పద్దతిలో జీవనోపాదికి ఉపయోగపడేలా వాటిని ఖర్చు చేసుకోవాలని సూచించారు.
జిల్లా పోలీసులు చేపట్టిన "ఆపరేషన్ చేయూత" కార్యక్రమానికి ఆకర్షితులై లొంగిపోయిన మావోయిస్టులకు జిల్లా పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఎస్పీ తెలియజేసారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసంతో పాటు ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను అందిస్తున్నామని తెలియజేశారు.






