13 April, 2026 | 2:26 PM

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ

13-04-2026 12:19 PM

మహిళల ఆలోచనలకు కొత్తరూపు

మహిళల రిజర్వేషన్ల బిల్లు అత్యావశ్యకం

2029లోగా రిజర్వేషన్లు అమలు

న్యూఢిల్లీ: ఢిల్లీలో 'నారీశక్తి వందన్ సమ్మేళన్'(Nari Shakti Vandan Sammelan) కార్యక్రమం నిర్వహించారు. 'నారీశక్తి వందన్ సమ్మేళన్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని  మహిళ రిజర్వేషన్ బిల్లుపై(Women's Quota Law) ప్రసంగించారు. వివిధ రంగాల ప్రముఖులతో ప్రధాని ముఖాముఖి నిర్వహించారు. 21వ శతాబ్దం మహిళలకు చెందినదని తెలిపారు. 21వ శతాబ్దంలో అతి కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నామని ప్రకటించారు. కేంద్రం తీసుకునే నిర్ణయం మహిళలకు అంకితం చేస్తున్నామని మోదీ వెల్లడించారు. పార్లమెంటు.. కొత్త చరిత్ర లిఖించడానికి చేరువలో ఉందన్నారు. స్వప్నాల సాకారంతో పాటు భవిష్యత్ సంకల్పాలను నెరవేరుస్తుందన్నారు.

2023లో కొత్త పార్లమెంటులో నారీ శక్తి వందన్ పై నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. మహిళల ఆలోచనలకు కొత్త రూపు సంతరించుకుంటుందని చెప్పారు. ఆర్థికమంత్రి నుంచి రాష్ట్రపతి వరకు మహిళలకు ఉన్నత స్థానాలు ఉన్నాయన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ప్రధాని పేర్కొన్నారు. మహిళల సాధికారతకు పంచాయతీరాజ్ విభాగం నిదర్శనం అన్నారు. మహిళలు తమదైన రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు.

మహిళల భాగస్వామ్యం  ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తోందని వెల్లడించారు.సామాజిక న్యాయం కేవలం పురుషుల వల్ల మాత్రమే కాదన్న ప్రధాని మోదీ మహిళల రిజర్వేషన్ల బిల్లు అత్యావశ్యకం అన్నారు. సుదీర్ఘకాలం తర్వాత మహిళల రిజర్వేషన్ల బిల్లు వస్తోందన్నారు. ప్రతి పార్టీ మహిళా రిజర్వేషన్ల బిల్లును ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని పిలుపునిచ్చారు. మహిళల కోటా బిల్లును అన్ని పార్టీ ఆమోదించాలని కోరారు. 2029లోగా మహిళ రిజర్వేషన్ల బిల్లు అమలు చేయాలన్నారు. ఏప్రిల్ 16 నుంచి పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ జరుగుతోందని ప్రకటించారు.