విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
రైతులు, ప్రజలకు ఏడిఈ వెంకట్గౌడ్ విజ్ఞప్తి
చేర్యాల,జులై 30: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా విద్యుత్ ప్రమాదాల పట్ల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని చేర్యాల విద్యుత్ శాఖ ఏడీఈ వెంకట్గౌడ్ విజ్ఞప్తి చేశారు.చేర్యాల, ధూళ్మిట్ట, కొమురవెల్లి, మద్దూరు మండలాల పరిధిలోని వినియోగదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల వల్ల అక్కడక్కడ విద్యుత్ తీగలు తెగిపడటం,స్తంభాలు వంగిపోవడం జరుగుతోందని తెలిపారు.
ఇనుప స్తంభాలకు విద్యుత్ ప్రసరించి షాక్ తగిలే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా రైతులు పశువులను మేతకు తీసుకెళ్లే సమయంలో స్థానిక ట్రాన్స్ఫార్మర్లు, వంగిన స్తంభాల వద్ద అత్యంత జాగ్రత్తగా ఉండాలని కోరారు.విద్యుత్ శాఖ సిబ్బంది మరియు ఏఈల అత్యవసర ఫోన్ నంబర్లు నిరంతరం అందుబాటులో ఉంటాయని, ఎక్కడైనా తీగలు తెగిపడినా వెంటనే అధికారులకు లేదా లైన్మెన్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.






