ఉపాధి హామీ పనుల్లో కార్మికుల సంఖ్య పెంచాలి
ప్రతి పంచాయతీలో కనీసం 150 మంది పనికి రావాలి
డీఆర్డీవో దత్తారావు
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఉపాధి హామీ పనుల్లో కార్మికుల హాజరు పెంచి, ప్రతి కూలీకి కనీసం రూ.300 వేతనం వచ్చేలా పనులు నిర్వహించాలని డీఆర్డీవో దత్తారావు సూచించారు. శుక్రవారం ఆసిఫాబాద్ మండలంలోని బూరుగుడ గ్రామపంచాయతీలో కొనసాగుతున్న ఫ్లడ్ డైవర్షన్ డ్రెయిన్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడిన ఆయన పంచాయతీలోని ప్రతి కార్మికుడు ఉపాధి హామీ పనులకు హాజరై పూర్తి స్థాయిలో పనిచేయాలని కోరారు. సగటు వేతనం కనీసం రూ.300 వచ్చే విధంగా పనుల ప్రణాళిక ఉండాలని తెలిపారు.
ప్రతి గ్రామపంచాయతీలో కనీసం 150 మంది కార్మికులు పనులకు వచ్చేలా లేబర్ ఇంప్రూవ్మెంట్ చర్యలు చేపట్టాలని క్షేత్ర సహాయకులు, సాంకేతిక సహాయకులను ఆదేశించారు. పనుల నాణ్యతతో పాటు కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్ సంగీత లచ్చన్న, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.






