జనాభా గణనలో పాల్గొనడం ప్రతి ఒక్కరి బాధ్యత
గణనతోనే అభివృద్ధి ప్రణాళికలు సాధ్యం.
పౌరుల ఉజ్వల భవిష్యత్తుకు గణన అవసరం.
అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.
గద్వాల టౌన్ : జనాభా గణనలో పాల్గొనడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పౌరుల ఉజ్వల భవిష్యత్తుకు, అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ పథకాల అమలుకు గణన దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జనాభా గణన-2027 కార్యక్రమంలో భాగంగా గణనపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు శుక్రవారం కలెక్టరేట్ నుంచి కృష్ణవేణి చౌరస్తా వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఐడిఓసి వద్ద కలెక్టర్ జెండా ఊపి జనగణన అవగాహన ర్యాలీని ప్రారంభించారు. వివిధ శాఖల అధికారులు, యువత, విద్యార్థులు, ప్రజలు జనగణన ప్రాముఖ్యతపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు.
కృష్ణవేణి చౌరస్తా కు ర్యాలీ చేరుకున్న అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పదేళ్లకు ఒకసారి నిర్వహించే జనాభా గణన ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న జనాభా గణనలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్నూమరేషన్ చేసుకునేందుకు అవకాశం ఉన్నందున అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎన్నుమరేటర్ లు తమ పరిధిలోని ఇంటింటికి తిరిగి మొదట ఇండ్ల గణన చేపడతారని, వచ్చే ఏడాది జనాభా గణన చేయడం జరుగుతుందన్నారు.
ప్రజలు ఎన్నుమరేటర్ లకు సహకరించి నిర్దేశిత సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కోరారు. జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల్లో, గ్రామాల్లో జనగణపై అవగాహన కలిగించడం జరుగుతోందని అందరూ సహకరించాలన్నారు. ప్రజలు ఇచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచడం జరుగుతుందని, ఎలాంటి ఇబ్బంది లేనందున ప్రతి ఒక్కరూ జనాభా గణనలో భాగస్వాములు కావాలని సూచించారు. సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ అధికారులు జనగణను విజయవంతం చేసేందుకు బాధ్యతాయుతంగా పనిచేయాలని, గణన దేశాభివృద్ధికి ఎంతో కీలకమని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
అనంతరం ప్రపంచ తలసేమియా వ్యాధి దినోత్సవంను పురస్కరించుకొని వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రామ్ అధికారి రాజు మాట్లాడారు. తలసేమియా వ్యాధి లక్షణాలు, చికిత్స, తదితర అంశాలపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, సిపిఓ పాపయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఇతర సిబ్బంది, యువత, విద్యార్థులు, పలువురు అంగన్వాడి, ఆశా కార్యకర్తలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.






