04-02-2026 12:00:00 AM
వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన చిత్రం ‘శ్రీ చిదంబరం’. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్పై చింతా వినీష రెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో వినయ్ రత్నం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఫిబ్రవరి 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు వినయ్ రత్నం పాత్రికేయులతో ముచ్చటించారు. “ఇది పూర్తిస్థాయి వినోదా త్మక చిత్రం కాదు. స్వచ్ఛమైన భావోద్వేగాల ప్రయా ణం ఇది. సమాజంలో చాలా మంది పక్కవాళ్లకు ఉన్నవి చూసి మనకు అవి లేవు కదా అని పోల్చుకుంటున్నారు.
అందుకే ఈ కథను సున్నితమైన భావోద్వేగాలతో చెప్పాలని అనుకున్నా. ఒక మనిషిని నువ్వు ప్రేమించగలగాలంటే మొదట నిన్ను నువ్వు ప్రేమించాలనేది ఈ కథ సారాంశం. చిదంబరం పాత్ర తరహా మనుషులను చాలా మంది స్నేహితులను చూశాను. నా స్నేహితుడు యూఎస్లో ఉంటాడు. వాడు ఎక్కడికి వెళ్లడు. ఎవ్వరిని ఇబ్బందిపెట్టడు. వాడ్ని చూసి ఈ కథ చెప్పాలని అనిపించింది. అభద్రతా భావంతో జీవితం కొనసాగిస్తున్న వాళ్లందరూ ఈ సినిమా కథకు స్ఫూర్తి.
ఈ సినిమా చూసిన ఎవ్వరికి మనోభావాలు దెబ్బతినవు. వాళ్ల మనోభావాలు సంతృప్తి పొందుతాయి. ఈ సినిమాలో హీరోని చిదంబరం అని పిలిచి పిలిచి అతని అసలు పేరు కూడా మరిచిపోతాడు. ఇక కథ విన్న తర్వాత పాత్ర మీద గౌరవం పెరిగి ‘శ్రీ చిదంబరం’ అన్నాం. ఫైనల్ కాపీ చూసుకున్న తర్వాత మరింత మర్యాద పెరిగి ‘శ్రీ చిదంబరం గారు’ అని పెట్టాం. ఈ సినిమాకు సంగీతం ఎంతో ప్రాణం. ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘పెళ్లిచూపులు’తో పోల్చుతున్నారు. నేను ఆ సినిమాలు చూసే నేర్చుకున్నా.. వాటితో నా చిత్రాన్ని పోల్చడం ఆనందంగా ఉంది” అని తెలిపారు.