శిధిలావస్థలో ప్రయాణికుల ప్రాంగణం
కొత్తగూడెంలో నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మించాలి
బీజేపీ కొత్తగూడెం టౌన్ అధ్యక్షులు శీలం విద్యాసాగర్
కొత్తగూడెం,(విజయక్రాంతి): బీజేపీ కొత్తగూడెం టౌన్ అధ్యక్షులు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో, మంగళవారం,కొత్తగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ రాజలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ... కొత్తగూడెం ప్రజలకు ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్న ప్రస్తుత ఆర్టీసీ బస్టాండ్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని అన్నారు. భవనం పైకప్పులు శిధిలావస్తాలో వర్షపు నీరు కారడం, ప్రయాణికులకు కనీస సౌకర్యాలు లేకపోవడం, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
నిత్యం వేలాది మంది ప్రయాణికులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు ఈ బస్టాండ్ను వినియోగిస్తున్నప్పటికీ వారి భద్రతకు ఎలాంటి హామీ లేదని, ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల, ప్రజల ప్రాణాల భద్రతను దృష్టిలో ఉంచుకొని తక్షణమే అన్ని ఆధునిక సౌకర్యాలతో, నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అవసరమైన నిధులు మంజూరు చేసి పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.






