పేదల ఇళ్లు కూల్చివేతపై సీఎం క్షమాపణ చెప్పాలి
వెలుగుమట్లలో ఎంపీ ఈటల పర్యటన.
ఏ కోర్టు ఆదేశాలతో ఇళ్లు కూల్చారు.
ఈ భూములపై గతంలో కేసీఆర్ ప్రభుత్వం కన్నేసింది.
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(MP Etela Rajender) పర్యటించారు. ఖమ్మంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులను ఎంపీ ఈటల రాజేందర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ... వందలమంది పోలీసులతో వెళ్లి ఇళ్లు కూల్చారని ఈటల మండిపడ్డారు. ప్రభుత్వం కూలిపోవాలని ప్రజలు శపిస్తున్నారని తెలిపారు. ఇదే భూములపై గతంలో బీఆర్ఎస్ పార్టీ కన్నేసిందని ఆరోపించారు. ప్రజలు దిరగబడడంతో బీఆర్ఎస్ వెనక్కి తగ్గిందని వివరించారు.
ఇప్పుడు ఏ కోర్టు ఆదేశాలతో ఇళ్లు కూల్చారు? అని ఆయన రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దమ్ముంటే భూదాన్ భూములపై లెక్కలు తేల్చాలని సవాల్ చేశారు. పెద్దోళ్ల ఆస్తుల జోలికి వెళ్లేందుకు భయపడతారు.. పేదలపైకి మాత్ర బుల్డోజర్లు పంపిస్తారని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. పేదల ఇళ్లను కూల్చడమొక్కటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలుసని విమర్శించారు. వెలుగుమట్లలో పేదల ఇళ్లు కూల్చివేతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఈటల డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.




