1 September, 2026 | 1:07 AM

వేయి స్తంభాల దేవాలయంలో ఎమ్మెల్యే నాయిని దంపతుల ప్రత్యేక పూజలు

01-09-2026 12:23 AM

హనుమకొండ, ఆగస్టు 31(విజయ క్రాంతి): శ్రావణ బహుళ తృతీయ సోమవారం, సంకట చతుర్థి సందర్భంగా చారిత్రక వేయి స్తంభాల దేవాలయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నీలిమ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మ ముహూర్తంలో నిర్వహించిన సుప్రభాత సేవ, మంగళవాయిద్య సేవల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు ఉద్దిష్ట గణపతికి ఆవుపాలు, పెరుగు, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.

సర్వగ్రహ దోష నివారణ, ప్రజల సుఖసంతోషాలను ఆకాంక్షిస్తూ గణనాథునికి ప్రత్యేక పూజలు, నీరాజనం, మంత్రపుష్పాలు సమర్పించారు. శివునికి ప్రీతికరమైన సోమవారం సందర్భంగా రుద్రాభిషేకం, రుద్రాధ్యాయం నిర్వహించి స్వామివారిని సేవించారు. అనంతరం ఆలయ నాట్య మండపంలో భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంబంధిత శాఖల సహకారంతో వేయి స్తంభాల దేవాలయం దినదినాభివృద్ధి చెందుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఆలయం చుట్టూ గార్డెన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, గార్డెన్ పూర్తయితే పచ్చని చెట్ల మధ్య భక్తులు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేదతీరే అవకాశం కలుగుతుందని అన్నారు.

గార్డెన్ నిర్వహణను కూడా నిరంతరం మెరుగ్గా చేపట్టాలని సూచించారు. తృతీయ సోమవారం సందర్భంగా శివభక్తులు, దాతల సహకారంతో పేద భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రుద్ర సేవా సమితి సభ్యులు పులి రజనీకాంత్, వెంకటేశ్వర సేవా సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.