16-02-2026 12:17:49 AM
మేడ్చల్, ఫిబ్రవరి 15 (విజయ క్రాంతి): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదివారం కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు. భక్తుల కోలాహలం శివనామ స్మరణతో కీసరగుట్ట మారుమోగింది. ఆర్ అండ్ బి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు.
వీరికి ఆలయ చైర్మన్ వెంకటేష్, అర్చకులు స్వాగతం పలికారు. పలువు సీనియర్ జడ్జిలు సైతం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఆలయ పరిసర ప్రాంతాలలో ఉన్న శివలింగాలకు అభిషేకాలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో క్యూ లైన్ లో నిండిపోయాయి. దర్శనానికి రెండు మూడు గంటల సమయం పట్టింది. కొంతమంది భక్తులు క్యూ లైన్ లో సొమ్మ సిల్లీ పడిపోయారు.
నిర్వాహకులు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయనందున భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాగునీటి వసతి కల్పించలేదు. పోలీసుల విఐపి దర్శనాలతో సామాన్య భక్తులకు దర్శనం ఆలస్యమైంది. పోలీసులు తమ కుటుంబీకులకు, బంధువులకు, మిత్రులకు ప్రత్యేక దర్శనాలు చేయించారు. పోలీసుల తీరుపై భక్తులు అసహనం వ్యక్తం చేశారు.
పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి శ్రీధర్ బాబు దంపతులు
సోమవారం రాత్రి జరిగిన స్వామివారి కల్యాణంలో జిల్లా ఇన్చార్జి మంత్రి డి శ్రీధర్ బాబు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.