25 February, 2026 | 3:26 PM

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి

25-02-2026 12:59 PM

జిల్లా ఎస్పీ నితికా పంత్

వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండల పరిధిలోని ఇందాని, గణేశ్‌పూర్, సోనాపూర్, వాంకిడి, కమాన ఎక్స్ రోడ్ ప్రాంతాల్లో గుర్తించిన బ్లాక్ స్పాట్స్‌ను జిల్లా ఎస్పీ నితికా పంత్ పరిశీలించారు.ఈ సందర్భంగా జాతీయ రహదారుల సంస్థ (National Highways Authority of India) అధికారులు, పోలీస్ అధికారులతో ఎస్పీ సమావేశమై రోడ్డు ప్రమాదాల నివారణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రమాదాలకు అధికంగా గురయ్యే ప్రాంతాల్లో స్పష్టమైన సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం, సోలార్ లైటింగ్ సదుపాయం కల్పించడం, అవసరమైన చోట్ల రోడ్ బంప్స్ ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని తెలిపారు.

రోడ్డు భద్రతకు సంబంధించిన హెచ్చరిక బోర్డులు, స్పీడ్ లిమిట్ సూచనలు, రిఫ్లెక్టివ్ మార్కింగ్స్ సమర్థవంతంగా అమలు చేస్తే వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.రోడ్డు మౌలిక సదుపాయాల మెరుగుదలతో పాటు ప్రజల్లో అవగాహన పెంపొందించడం ముఖ్యమని, పోలీస్ శాఖ , సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రమాదాలను గణనీయంగా తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్, వాంకిడి సీఐ సత్యనారాయణ, డీసీఆర్‌బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్, వాంకిడి ఎస్ఐ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.