రైల్వే గేట్ వద్ద తారు రోడ్డుకు శంకుస్థాపన
ముకరంపుర, ఆగస్టు 30(విజయ క్రాంతి): తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్ వద్ద సరైన రోడ్డు సౌకర్యం లేక స్థానిక ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రజల సమస్యను వెంటనే పరిష్కరించాలనే ఉద్దేశంతో మేయర్ సంబంధిత ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
అయితే రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధుల కొరత ఉందని ఆర్అండ్బీ అధికారులు తెలియజేయడంతో, ప్రత్యామ్నాయ మార్గంలో సమస్యను పరిష్కరించాలని మేయర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా మున్సిపల్ సాధారణ నిధులు నుంచి రూ.33 లక్షలు కేటాయించి తారు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా తీగలగుట్టపల్లి రైల్వే గేట్ వద్ద రూ.33 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో నిర్మించనున్న తారు రోడ్డు పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు.
కరీంనగర్ నగరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కృషి చేస్తున్నారని మేయర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్లు సాదినేని లావణ్య మునిందర్, భారీ అపర్ణ జితేందర్, మున్సిపల్ అధికారులు, రైల్వే అధికారులు, స్థానిక ప్రజలు, నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






