1 August, 2026 | 9:31 PM

గుప్తనిధుల పేరుతో ఘరానా మోసం

01-08-2026 08:24 PM

-అప్పు కింద రంగురాళ్లు అంటగట్టిన కేటుగాడు..!

- తీసుకున్న అప్పు తీర్చాలని అడిగితే గుప్తనిధుల్లో దొరికిన బంగారమని చెప్పి రంగు రాళ్లు అంటకట్టాడు.

- ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది.

నిజామాబాద్,(విజయక్రాంతి): నిజామాబాద్ తీసుకున్న అప్పు తీర్చాలని అడిగితే గుప్తనిధుల్లో దొరికిన బంగారమని చెప్పి రంగు రాళ్లు అంటకట్టాడు. ఈ ఘరానా మోసం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల పరిధిలో వెలుగు చూసింది.

 నిజామాబాద్ హమాల్వాడికి చెందిన..

ఎస్సై ఆరిఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్  నగరంలోని హమాల్వాడికి చెందిన పిల్ల రమేష్‌ కుమార్‌.. ఇంటి ముందు శ్రీనివాస్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి గత 15ఏళ్లుగా అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలో రమేష్‌ వద్ద శ్రీనివాస్ రూ.1.30 లక్షల వరకు అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు తీర్చమని రమేష్ ఎన్నిసార్లు ఒత్తిడి చేసినా శ్రీనివాస్ ఏవేవో కారణాలు చెబుతూ వాయిదా వేస్తూ వచ్చాడు.

పక్కా పథకంతో స్కెచ్..

రూపాయి కూడా తిరిగి ఇచ్చే ఉద్దేశం లేకపోవడంతో శ్రీనివాస్ ఓ మాయమాటల పథకానికి తెరలేపాడు. తనకు గుప్తనిధుల్లో బంగారం దొరికిందని, అప్పుకు బదులుగా ఆ బంగారాన్ని ఇస్తానని రమేష్‌కు ఆశ చూపాడు. అయితే ఈ విషయం బయటకు తెలియకూడదని, అందుకే ఇంటి దగ్గర కాకుండా వేరే ప్రదేశంలో కలవాలని సూచించాడు. అంతేకాకుండా, బంగారం ఇస్తున్నందుకు అదనంగా మరో రూ.32 వేలు ఇవ్వాలని మెలిక పెట్టాడు.

కుండలో బంగారపు పూత రాళ్లు!

శ్రీనివాస్ మాటలను నమ్మిన రమేష్.. గురువారం డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్ గ్రామంలోని తన చుట్టాల ఇంటికి చేరుకుని నిందితుడికి సమాచారం అందించాడు. అక్కడకు చేరుకున్న నిందితులు ఒక కుండలో ఉన్న నాలుగు బంగారం రంగు పూసిన రాళ్లును రమేష్‌కు ఇచ్చి, అప్పుతో పాటు అదనంగా తెచ్చిన డబ్బును తీసుకుని అక్కడి నుంచి జారుకున్నాడు. వాళ్లు వెళ్లాక అనుమానం వచ్చి సరిగ్గా పరిశీలించగా.. అవి బంగారం కాదని, కేవలం రంగు పూసిన రాళ్లని తేలడంతో రమేష్ షాక్‌కు గురయ్యాడు. దారుణంగా మోసపోయానని గ్రహించిన బాధితుడు డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించినట్లు ఎస్సై ఆరీఫ్ తెలిపారు.