నెట్వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య
టార్గెట్ల వేధింపులే కారణమని గ్రామస్తుల ఆవేదన
నవాబ్ పేట: నెట్వర్కింగ్ మార్కెటింగ్(Network Marketing) వ్యాపారంలో ఎదురవుతున్న మానసిక ఒత్తిళ్లు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. నవాబుపేట పోలీస్ స్టేషన్(Nawabpet Police Station) పరిధిలో చౌడాపూర్ మండలం కిష్టంపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన మురుగనీ సురేష్ (22) అనే యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
స్థానికుల వివరాల ప్రకారం, మురుగనీ సురేష్ కొంతకాలంగా నెట్వర్కింగ్ మార్కెటింగ్ రంగంలో చురుగ్గా పని చేస్తున్నాడు. అయితే, ఈ రంగంలో ఉండే కఠినమైన టార్గెట్లు, కొత్త సభ్యుల చేరికల కోసం పైస్థాయి వ్యక్తుల నుంచి వచ్చే ఒత్తిళ్లు అతడిని తీవ్ర మనోవేదనకు గురిచేసి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఎప్పుడూ అందరితో సరదాగా, చలాకీగా ఉండే సురేష్.. అకస్మాత్తుగా ఇంతటి దారుణ నిర్ణయం తీసుకోవడం పట్ల గ్రామస్తులు నివ్వెరపోతున్నారు.సోమవారం తెల్లవారుజామున సురేష్ చెట్టుకు ఉరివేసుకుని వేలాడుతుండటం చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సురేష్ మరణవార్త విన్న , కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు లేదా పని ఒత్తిడి వల్లే తన కుమారుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.




